నధుల అనుసంధానంతో దేశానికి ప్రయోజనం ఉంటుందని, వృధాగా సముద్రంలోకి పోతున్న నీటి ప్రతి చుక్కను రైతుల పంటపొలాలలకి మళ్లించే ఆస్కారం ఉందని నిపుణుల మాట. ఇందుకు తగ్గట్టే కేంద్ర ప్రభుత్వం కూడా నదుల అనుసంధానంపై దృష్టి సారించింది. పట్టిసీమ ద్వారా ఏపి ప్రభుత్వం కృష్ణ గోదావరి నదుల అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగినా, ఆపై గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానాన్నిఆరంభించింది. అయితే దీనిని తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. నదుల అనుసంధానానికి అవసరమైన పర్యావరణ అనుమతులు లేవని స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వట్టి వసంతకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఎన్జిటి.. అన్ని అనుమతులు వచ్చేవరకు పనులను చేపట్టరాదని ఆదేశించింది. నదుల అనుసంధానంపై కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇవ్వకపోవడంపై ఎన్జిటి అసంతృప్తి వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కూడా అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా వేసింది.