అహింసను విడనాడి.. శాంతి మార్గంలో పయనించాలని ప్రవచించి ఆచరించిన భగవాన్ మహావీర్ బోధనలు అనుసరణీయమని జైన ఆచార్యులు అభయ్చంద్ర సూరీశ్వర్జి, అరవిందసాగర్ సూరీశ్వర్జిలు భక్తులకు ఉపదేశించారు. మహావీర్ జయంతిని పురస్కరిం చుకుని బుధవారం ఉదయం జైన్ సమాజ్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీలోని సీవీ రెడ్డి చారిటీస్ ప్రాంగణంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జైన మత గురువులు అభయ్చంద్ర సూరీశ్వర్జి, అరవిందసాగర్ సూరీశ్వర్జిలు మాట్లాడుతూ జీవహింస మహా పాపమని తెలిపారు. సకల చరాచర సృష్టిలో మనుషులతో పాటు జీవరాశులను కూడా ప్రేమతో ఆరాదించాలని పేర్కొన్నారు. సత్య మార్గంలో సహనంగా ముందుకు సాగాలని ప్రవచించిన భగవాన్ మహావీరుని జీవితాన్ని సమకాలీన ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బోధించిన శాంతి, అహింస మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. సమస్త విశ్వంలోని ప్రతి జీవి పట్ల ప్రేమను కలిగి ఉండాలని, అందరిని సమానంగా చూడాలనే సిద్ధాంతాన్ని భగవాన్ మహావీర్ ప్రబోధించారని తెలిపారు. ప్రకృతి మనకు ప్రసాదించిన వనరుల మీద మనకు హక్కు కంటే బాధ్యత ఎక్కువ ఉంటుంది. మన ముందు తరాలకు వాటిని అదే విధంగా అందించాల్సిన ధర్మకర్తల్లాంటి బాధ్యత మనందరిది. ఈ భూమికి, ఇక్కడ ఉండే జీవజాలానికి ఏ విధమైన హానీ చేయకుండా, ఈ సమస్త విశ్వాన్ని ముందు తరాలకు యధావిధిగా అందించేందుకు ప్రతిన బూనాలన్నారు. ఈ పవిత్రమైన మహావీరుని జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే దిశగా ప్రతిఒక్కరం కంకణబద్ధులం కావాలని ఆకాంక్షించారు.