తన హత్యకు ఎవరో కుట్ర చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. తన కారు ముందు చక్రం బోల్ట్ లు తీసేసి ఉన్నాయని చెప్పారు. దీనిపై తాను కేసు పెడితే 3 రోజులు దర్యాఫ్తు చేసిన పోలీసులు సడెన్ గా ఆపేశారని హర్షకుమార్ చెప్పారు. దీనిపై ఆయన సీఈవో ద్వివేదిని కలిశారు. తన కేసుపై దర్యాఫ్తుకు ఆదేశించాలని సీఈవోని కోరారు. ఐదేళ్లుగా ఏ పార్టీలో లేకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశానని హర్షకుమార్ చెప్పారు. దీంతో టీడీపీ ప్రభుత్వం తనను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని వాపోయారు. 42 సార్లు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. తన కారు టైరు బోల్టులు తీసేసిన ఘటన షో రూమ్ లోనే జరిగి ఉండొచ్చని హర్షకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. తన హత్యకు ప్లాన్డ్ గా స్కెచ్ వేశారన్నారు. తనకు శత్రువులు కూడా ఎవరూ లేరని అన్నారు. దీనిపై పోలీసులు దర్యాఫ్తు జరపాలని, తన హత్యకు ప్లాన్ చేసిన వారిని పట్టుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం ఇటీవల టీడీపీలో చేరానని చెప్పారు. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మోసం చెయ్యడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చానని అన్నారు.