ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో సారి చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ వాస్తు సిద్ధాంతి కొమ్మినేని మల్లేశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మూడు ప్రధాన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్, పవన్కల్యాణ్లు నివాసముంటున్న ఇళ్ల వాస్తు ప్రకారం చూస్తే చంద్రబాబు నూటికి నూరుశాతం మళ్లీ సీఎం అవుతారన్నారు. 25 ఏళ్ల నుంచి తాను అనేకమంది నేతల ఇళ్లపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు. ఇంటి వాస్తు దోషాల వల్ల అనేక మంది నాయకులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఎన్టీఆర్ పదవి నుంచి దిగిపోయే ముందు ఇంటి వాస్తు బాగోలేదని చెప్పినా అయన పట్టించుకోలేదన్నారు. నాదెండ్ల భాస్కరరావు నివాసముంటున్న ఇంటికి కూడా వాస్తు దోషముందని, అందుకే అందివచ్చిన అధికారం చేజారిపోయిందని తెలిపారు. ఈ విషయం తాను చెప్పినా పట్టించుకోలేదన్నారు. జగన్ ఉంటున్న లోటస్ పాండ్, తాడేపల్లిలో కొత్తగా నిర్మించుకున్న ఇల్లు కూడా వాస్తురీత్యా లోపాలు ఉన్నాయని, సీఎం అయ్యే అవకాశాలు లేవని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలో నిర్మించుకుంటున్న ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయని, ఆయనకి కూడా రాజయోగం లేదని తెలిపారు. కాగా, చంద్రబాబు నివాసముంటున్న హైదరాబాద్, ఉండవల్లి ఇళ్లు వాస్తు అద్భుతంగా ఉందన్నారు. నారా లోకేశ్ కూడా విజయం సాధించనున్నారని తెలిపారు.