కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో గల ఈవీఎం స్ట్రాంగ్ రూం భద్రతపై వైసీపీ ఆందోళన చెందుతున్నారు. న్యాయవాదుల బృందంతో జిల్లా ఏఎస్పీ, ఆర్డీఓని వైఎస్ఆర్ సిపి నేతలు కలిసి మెమోరాండం సమర్పించారు. అనుమతి లేకుండా స్ట్రాంగ్ రూంలోకి ఇతరులు ప్రవేశిస్తున్న వైనంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులే అనుకూల న్యూస్ చానెల్ రిపోర్టర్ లను వీడియో గ్రాఫర్ పేరుతో స్ట్రాంగ్ రూంకు తీసుకు వెళ్ళడంపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలకు అధికారులు కల్పించే భద్రత ఇదేనా అని వైఎస్ఆర్ సిపి నేతలు ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూంలకు వీడియో కవరేజీ పేరుతో టీడీపీ నేతలు చెప్పిన వారికే బాధ్యతలు అప్పగించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూం ఫుటేజీ బయటకు వచ్చినా అధికారపార్టీ నేతల వత్తిళ్ళతో కలెక్టర్ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షుడు షేక్ సిలార్ దాదా తెలిపారు.