ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు పై కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్ చౌహన్ నేతృత్వం లో జరిగిన ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్రం నుంచి రామకృష్ణ రావు, వేదాంతం గిరి హాజరుకాగాఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నీరబ్ కుమార్, దమయంతి ప్రేమచంద్ర రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. విభజన చట్టం లో యింకా అమలుకు నోచుకోకుండా పెండింగ్ లో వున్న అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారని, ప్రత్యేకించి విభజన చట్టం లోని 13 వ షెడ్యూల్ , సెక్షన్ 93 ల పై చర్చ జరిగిందని తెలుస్తోంది. అంతే కాకుండా విభజన చట్టంలోని పలు అంశాలపై ఈ సమావేశం లో సమీక్షించారు.
తెలంగాణ తరఫున రామకృష్ణా రావు, ఆంధ్ర ప్రదేశ్ తరఫున ప్రేమచంద్రా రెడ్డి ఈ సమావేశంలో తమ తమరాష్ట్రాల అభిప్రాయాలను వివరించారు.సమీక్షా సమావేశం బాగా జరిగిందని కేంద్ర ప్రభుత్వ హామీలపై ప్రస్తుత అమలు పరిస్థితి ని, కేంద్రం నుంచి యింకా రాష్ట్రాలకు అందాల్సిన అంశాల పరిస్థితి ని సమీక్షించారని తెలుస్తోంది.
తెలంగాణ కు సంబంధించి 6 అంశాల పై చర్చ జరిగింది. తెలంగాణ, ఆంద్ద్ర ప్రదేశ్ లలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఖమ్మం లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 4000 మెగా వాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ ఏర్పాటు చేయడం, రహదారుల విస్తరణకు, అభివృద్ధికి నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా చర్యలు చేప్పట్టడం, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రైల్ కనెక్టివిటీ పెంపొందించడం అంశాలపై సమీక్ష జరిగిందని తెలుస్తోంది.