పరిశ్రమ ఏదైతే మేనేజ్మెంట్ విద్యార్థుల నుండి ఆశిస్తుందో ఆ నైపుణ్యాన్ని ఆ విభాగం విద్యార్థులు వృద్ధి చేసుకోవాలని సూర్యా ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత యడ్ల వెంకట కృష్ణమోహన్ సూచించారు. పీబీ సిద్ధార్థ కళాశాల ఎంబీఏ విభాగం 25వ కురుక్షేత్ర-2019 (సిల్వర్జూబ్లీ) వేడుకలను సిద్ధార్థ ఆడిటోరియంలో శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణమోహన్ జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రారంభోత్సవ సభనుద్దేశించి మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నూతన ఆలోచనలతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయావకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని అంకుర పరిశ్రమలను ఉదహరిస్తూ ఓలా క్యాబ్స్ 3.5 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తుందని, వయో రూమ్స్ ఒక బిలియన్ వ్యాపారం చేస్తున్నాయని వారంతా స్వయంకృషితో వినూత్న ఆలోచనలతో అంకుర పరిశ్రమలు స్థాపించి విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే మానవ వనరులు, మార్కెంటింగ్, గుత్త నిర్వహణలలో సృజనాత్మక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కురుక్షేత్ర వంటి కార్యక్రమాలు సృజనాత్మకతను, విజ్ఞానాన్ని పంచుకునేందుకు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కురుక్షేత్ర ఈవెంట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ సి జంపాల మాట్లాడుతూ కురుక్షేత్రలోని వివిధ అంశాలను రూపొందించామని తద్వారా విద్యార్థులు పోటీతత్వాన్ని, మేథాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్క్రతిక నృత్యాలు, ఫ్యాషన్ షో అలరించాయి. కార్యక్రమానికి డాక్టర్ ఎండీఎస్ రెహమాన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, వివిధ కళాశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.