లోక్సభ ఎన్నికలకు అన్నీ పార్టీలు కసరత్తులు ఇప్పటినుంచే ప్రారంభించాయి. ఓటర్లను ఆకర్షించడానికి వినూత్న తరహాలో ప్రచారాలు చెయ్యాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే ‘నమో’ టీషర్ట్లు, ‘నమో’ కుర్తీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రచార పర్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో బీజేపీ ఇప్పుడు ‘నమో’ చీరలతో మహిళలను ఆకట్టుకోవాలని యోచిస్తోంది. సూరత్కు చెందిన ఓ వస్త్ర వ్యాపారికి 5 లక్షల నమో చీరలు కావాలంటూ ఆర్డర్ కూడా ఇచ్చింది.
ఈ చీరలపై అందమైన ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే ప్రధాని మోదీ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మోదీని సింహం, చిరుత పులితో పోలుస్తూ తయారు చేసిన ఈ చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, నమో ఎగైన్ మిషన్-2019 నినాదాలను చీరలపై రాశారు. నోట్ల రద్దు, స్వచ్ఛభారత్, మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను చీరపై ముద్రించారు.