కర్ణాటకలో బిజెపి నేతల ఆడియో టేపుల వ్యవహారంతో రాజకీయాల్లో సంక్షోభం నెలకొనగా, బిజెపి ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ వాయిస్ గా భావిస్తున్న మరో ఆడియో విడుదలైంది. ఒక జెడి(ఎస్) ఎమ్మెల్యే కుమారుడితో ఆయన సంభాషించినట్టుగా ఉన్న ఆడియోలో, త్వరలోనే దేవెగౌడ చనిపోనున్నారని, ఆయన కుమారుడు, సిఎం కుమారస్వామి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉందని, అతి త్వరలో జెడి(ఎస్) కనుమరుగవుతుందని అన్నారు. దీంతో ఆ పార్టీతో ఉంటే లాభం ఉండదని కూడా ఆయన అన్నారు. ఈ తాజా ఆడియోను అక్కడి మీడియా ప్రసారం చేయడంతో కొందరు అధికార పార్టీ కార్యకర్తలు హసన్ జిల్లాలోని ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి దిగారు. అయితే తనను హత్య చేసేందుకు జెడిఎస్ యత్నిస్తోందని ప్రీతమ్ ఆరోపించారు. కాగా, తమ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కుమారస్వామి కోరారు.