యాపిల్ సంస్థ చైనాకు షాక్ ఇస్తూ.. భారత్లో ఐఫోన్ 17 ఫోన్ల ముందస్తు తయారీని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో చైనాలోని ఫాక్స్కాన్ సంస్థ మూతపడి యాపిల్ ఫోన్ల తయారీ నిలిచిపోవడంతో.. ఆ సంస్థ క్రమంగా ఇతర దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలోనే భారత్లోనూ పలు ప్లాంట్లను నెలకొల్పింది. ఇక కొన్ని రోజుల క్రితం విడుదలైన ఐఫోన్ 16 ఫోన్లను కూడా భారత్లోనే తయారు చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఫోన్ తయారీకి ముందు చేసే ప్రక్రియలను కూడా తొలిసారి చైనాను కాదని భారత్లో చేసేందుకు యాపిల్ కంపెనీ సిద్ధం అయింది.
కొవిడ్ వేళ యాపిల్ సంస్థకు చైనాలో ఎదురైన ఎదురుదెబ్బలతో ఐఫోన్ల తయారీని యాపిల్ కంపెనీ ఇతర దేశాల్లో మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాకు మరో షాక్ తగిలింది. యాపిల్ సంస్థ ఐఫోన్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్లో చేపట్టనుంది. ఇప్పటివరకు ఈ ఐఫోన్ల ముందస్తు తయారీ ప్రక్రియను చైనాలో మాత్రమే చేపట్టిన యాపిల్ సంస్థ.. మొట్టమొదటిసారి చైనా దేశాన్ని దాటి మరో దేశానికి వెళ్తుండటం గమనార్హం.
గత కొన్నేళ్లుగా పలు ఐఫోన్ మోడళ్లు భారత్లో తయారు చేస్తున్నారు. భారత్లో తయారైన ఈ ఐఫోన్లను యాపిల్ కంపెనీ.. భారీ సంఖ్యలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. సాధారణంగా ఐఫోన్ మోడల్ విడుదలైన తర్వాత మిగితా ఫోన్లను భారత్లో తయారు చేస్తూ ఉంటారు. కానీ.. అమెరికాలోని యాపిల్ పార్క్లో తర్వాతి తరం మొబైల్ డిజైన్ రూపొందించాక.. కమర్షియల్ లాంచ్కు ముందు ఫోన్లను మాత్రం చైనాలోనే ఇన్నిరోజులు యాపిల్ కంపెనీ చేపట్టింది. అంటే పూర్తిస్థాయిలో తయారు చేయడానికి ముందు ఉన్న ఐఫోన్లన్నింటినీ చైనాలో తయారైనవే కావడం గమనార్హం. సాధారణంగా ఈ ముందస్తు తయారీ ప్రక్రియ అక్టోబర్ నుంచి మే నెల మధ్యలో జరుగుతూ ఉంటుంది.
కానీ ఇప్పుడు యాపిల్ కంపెనీ తన మనసు మార్చుకుంది. ఐఫోన్17 మోడల్ విషయంలో ముందస్తు తయారీని భారత్లోని ఓ ప్లాంట్లో నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలా తయారు చేసిన ఐఫోన్ను 2025 జూన్ తర్వాత యాపిల్ సంస్థ సాధారణంగా విడుదల చేస్తుంది. మరీముఖ్యంగా కరోనా వేళ చైనాలో యాపిల్ సంస్థకు తలెత్తిన సమస్యల దృష్ట్యా ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో చైనాలోని ఫాక్స్కాన్ ప్లాంట్ మూతపడి.. ఐఫోన్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇక తమ ఐఫోన్ల ఉత్పత్తిని చైనా కాకుండా ఇతర దేశాల్లో చేపట్టాలని యాపిల్ సంస్థ నిర్ణయించింది. అదే సమయంలో భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన యాపిల్.. తొలుత బేస్ మోడళ్లను మాత్రమే తయారు చేసింది. అయితే ఇటీవల విడుదలైన యాపిల్ 16 ప్రో మోడళ్లను సైతం భారత్లోనే తయారు చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa