ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షర్మిల లాంటి చెల్లెలు ఏ కొంపలో ఉండకూడదు.. మా దరిద్రానికి తోడైంది.. వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:22 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ముదురుతున్నాయి. వైఎస్ జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేయడంతో మొదలైన ఈ వ్యవహారం రోజురోజుకూ ఇరువురు నేతల మధ్య విమర్శలకు దారితీస్తోంది. ఇదే క్రమంలోనే వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ జగన్ తన సొంత ఆస్తిలో.. చెల్లెలుకు వాటా ఇవ్వాలనుకున్నారని, కానీ షర్మిల మాత్రం వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. వైఎస్ షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా అంతం చేయడమే షర్మిల ఉద్దేశమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


"మా ఇంటి రామాయణం బజారుకు ఈడ్చారు షర్మిల. అక్రమ కేసుల కారణంగా వైఎస్ జగన్ ఆస్తులు అన్నీ కూడా.. ఈడీ, సీబీఐ చేతిలో అటాచ్ అయ్యాయి. దీంతో ఆస్తుల బదలాయింపు జరగలేదు. అయితే షర్మిల మీద ప్రేమతో వైఎస్ జగన్ ఇవ్వాల్సిన ఆస్తులపై ఎంవోయూ చేసుకున్నారు. అవి కూడా ఆయన సంపాదించిన ఆస్తులు. వీటిపై షర్మిలకు హక్కేమీ లేదు. అవేమీ వాళ్ల తండ్రి గారు సంపాదించినవీ కాదు. కేసులు పరిష్కారమైన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనీ.. అప్పటి వరకూ ఆస్తుల బదలాయింపు చేయకూడదని ఎంవోయూలో ఉంది. కానీ వైఎస్ షర్మిల మాట్లాడుతుంటే అన్న మీద రాయి వేయడం కాదు.. బాంబు వేయాలనేదే ఆమె ఉద్దేశంలా అనిపిస్తోంది." అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.


" వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయాలనేదే వైఎస్ షర్మిల లక్ష్యం. వైఎస్ జగన్‌కు సమాజంలో గౌరవం, అధికారం, విలువ పోతేనే షర్మిలకు సంతోషం.ఇది రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల విషయం కాదు. ఇది జగన్ మోహన్ రెడ్డి సంపాందించిన ఆస్తుల విషయం. వైఎస్ జగన్ చెప్పింది శతాబ్దపు జోక్ అని షర్మిల అంటున్నారు. గత వందేళ్లు చూసుకుంటే నీలాంటి చెల్లెలు ఏ కొంపలో ఉండదు. మా ఖర్మకు, మా దరిద్రానికి నువ్వు తోడయ్యావు. మమ్మల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు. జగనన్నకు ఉండకూడని చెల్లెలివి నువ్వు. అన్నను జైలుకు పంపాలనేదా నీ ఉద్దేశం?" అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి షర్మిలపై విరుచుకుపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com