విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియాతో 11 మంది మృతికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరోపించారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, డయేరియా మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవాలని ఆయన డిమాండ్ చేశారు.
గవర్నమెంట్ స్కూళ్లలో మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తున్నారని, బెంచీలపైనే డయేరియా బాధితులకు వైద్యం చేస్తున్నారని ప్రస్తావించిన ఆయన, ప్రభుత్వం కనీసం బెడ్స్ కూడా ఏర్పాటు చేయని స్థితిలో ఉందా అని నిలదీశారు. డయేరియా బాధితుల పట్ల ప్రభుత్వ తీరు దారుణమని దుయ్యబట్టారు. డయేరియాతో అతలాకుతలమవుతున్న విజయనగరం జిల్లా గుర్ల సందర్శించిన మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు, ఆ వ్యాధి బాధితులను పరామర్శించారు.