ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రెండ్రోజుల్లోగా వాయుగుండంగా .. ఈ జిల్లాలలో వానలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 06:47 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు వదలనంటున్నాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఇటీవలే ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వానలు పడ్డాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగి జనం ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే ఇది మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాయుగుండం ముప్పు భయపెడుతోంది. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. రెండురోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


ఈ అల్పపీడనం అక్టోబర్ 22 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అక్టోబర్ 23వ తేదీ నాటికి ఈ వాయుగుండం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం ఒడిశా- పశ్చిమబెంగాల్ మధ్యన తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25వ తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని సూచించింది.


మరోవైపు సోమవారం పలు జిల్లాలలో వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పల్నాడు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్‌ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లా, ప్రకాశం, నెల్లూరు ,నంద్యాల జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించారు. అక్టోబర్ 25 వరకూ వేటకు వెళ్లవద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com