ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 సార్లు చావు నుంచి బయటపడి.. జమ్మూ కాశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ

national |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 09:08 PM

ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధించగా.. తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ ప్రమాణం చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన సకీనా ఈటూ.. తండ్రి, సోదరుడు కూడా రాజకీయాల్లో ఉండేవారు. ఆమె తండ్రి, సోదరుడిని ఉగ్రవాదులు చంపేయగా.. సకీనా ఈటూ 20 సార్లు హత్యాయత్నాల నుంచి బయటపడ్డారు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన సకీనా ఈటూ.. తాజాగా మరోసారి ఒమర్ అబ్దుల్లా కేబినెట్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక మహిళగా నిలిచారు.


దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లా డీహెజ్‌ పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సకీనా ఈటూ ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి గుల్జార్‌ అహ్మద్‌ దర్‌పై 17,449 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సకీనా ఈటూ.. నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. సకీనా ఈటూ తండ్రి వలీ మోహమ్మద్‌ ఈటూ.. గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఆయన 1994లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత సకీనా ఈటూ సోదరుడు రాజకీయాల్లోకి రాగా.. అతడ్ని 2001లో ఉగ్రవాదులు హత్య చేశారు.


ఆ సమయంలో మెడిసిన్ చదువుతున్న సకీనా ఈటూ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సకీనా ఈటూపై 20 సార్లకు పైగా హత్యాయత్నాలు జరిగినా ప్రాణాలతో ఆమె బయటపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో జమ్మూ కాశ్మీర్‌ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా పర్యాటక శాఖ, విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు జమ్మూ కాశ్మీర్ సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్నారు. 53 ఏళ్ల సకీనా ఈటూ.. తాజాగా ఒమర్ అబ్దుల్లా కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్‌ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న అతి కొద్దిమంది మహిళా నేతల్లో సకీనా ఈటూ ఒకరు కావడం గమనార్హం.


మరోవైపు.. జమ్ములోని నౌషేరా అసెంబ్లీ సీటు నుంచి ఎన్నికైన సురిందర్ చౌధరీని ఒమర్ అబ్దుల్లా డిప్యూటీ సీఎంగా నియమించారు. జమ్ము ప్రజల గళాన్ని శాసనసభలో వినిపించేందుకు సురిందర్ చౌధరీకి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టినట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తన ప్రభుత్వంలో జమ్మూ ప్రజలకు ప్రాతినిధ్యం లేదని వారు బాధపడాల్సిన అవసరం లేకుండా జమ్మూ ప్రాంతం నుంచి గెలిచిన వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినట్లు ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com