ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు.. అలా ఎలా డిసైడ్ చేస్తారని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 08:39 PM

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్‌ల భవనాలకు పసుపు రంగులు వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అన్న క్యాంటీన్లకు టీడీపీ రంగులు వేస్తున్నారంటూ ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీడీపీకి సంబంధించిన పసుపు రంగును వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తావించారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేస్తున్నారని.. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారని.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.


గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు బులుగు రంగు తొలగించాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రంగులు తొలగించడానికి సమయం పట్టగా.. కొర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రంగును బట్టి పార్టీని ఎలా డిసైడ్‌ చేస్తారని ప్రశ్నించింది. అన్న క్యాంటీన్‌కు ఇంతకుముందు ఏ రంగులు వేశారని ప్రశ్నించింది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.


గత వైఎస్సార్‌సీపీ హయాంలో కూడా ఈ రంగుల వివాదం నడిచింది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలతో పాటుగా మరికొన్ని భవనాలకు బులుగు రంగు వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏపీ హైకోర్టులో పిటిషన్‌లు దాఖల చేయగా.. సుధీర్ఘంగా విచారణ జరిగింది. చివరికి హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న బులుగు రంగును తొలగించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వెంటనే రంగుల్ని తొలగించింది. ఈ రంగుల వ్యవహారం గత ఐదేళ్లలో పెద్ద వివాదమే అయ్యింది.


ఏపీలో 2014-2019లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ఈ క్యాంటీన్లను మూసివేసింది.. ఐదేళ్ల పాటూ వాటిని అలాగే వదిలేశారు. అయితే జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంపై ఫోకస్ పెట్టింది. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల మరమ్మత్తుల పనులు చేపట్టింది.. ఆ తర్వాత వాటిని రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో ప్రారంభించారు. అయితే 2014-2019 మధ్య అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేసిన సమయంలో పసుపు రంగును వేశారు. మూడు నెలల క్రితం ప్రారంభమైన సమయంలో కూడా అన్న క్యాంటీన్‌లకు పసుపు రంగులు వేశారు. దీంతో ఈ రంగుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరి అన్న క్యాంటీన్‌లకు పసుపు రంగులపై ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com