ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు సేవ చేయరా.. ఆంధ్రాకు వెళ్లాల్సిందే.. ఐఏఎస్‌లకు తేల్చేసిన క్యాట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 06:44 PM

క్యాడర్ కేటాయింపులపై కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) కీలక ఆదేశాలు జారీ చేసింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం యధావిధిగా రేపు (అక్టోబర్ 16) రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని ఐఏఎస్ అధికారులకు స్పష్టం చేసింది. అక్టోబర్ 16 లోగా సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలంటూ ఏపీ, తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇటీవలే కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఉత్తర్వులు రద్దు చేయాలంటూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్, సృజనలు క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఐఏఎస్ అధికారిణి సృజన ఏపీలో పనిచేస్తున్నారు.


అయితే తాము ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ వీరంతా క్యాట్‌ను ఆశ్రయించారు ఈ పిటిషన్‌ను క్యాట్ మంగళవారం విచారించింది. ఇక విచారణ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే వారికి సేవ చేయాలని లేదా అని ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఐఏఎస్ అధికారుల కేటాయింపులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సోనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే స్థానికత ఆధారంగా స్వాపింగ్ చేసుకునే వెసలబాటు మార్గదర్శకాల్లో ఉందా అని క్యాట్ ప్రశ్నించినట్లు తెలిసింది.


మరోవైపు విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన పిటిషనర్ల తరుఫు న్యాయవాది.. సింగిల్ మెన్ కమిటీ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని క్యాట్ దృష్టికి తెచ్చారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని.. ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవాలని క్యాట్‌ను కోరారు. అయితే దీనికి అంగీకరించిని క్యాట్.. డీవోపీటీ ఆదేశాల ప్రకారం రేపు రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే క్యాట్ తీర్పుపై ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com