ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లీజ్ మా దేశానికి రండి.. భారత టూరిస్టులకు ముయిజ్జు స్పెషల్ రిక్వెస్ట్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 09:36 PM

నాలుగు రోజులు ద్వైపాక్షిక పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. భారత్, మాల్లీవుల సంబంధాలు, ఇరు దేశాల మధ్య పలు అంశాలు ఈ భేటీలో చర్చించారు. కాగా, టైమ్స్‌ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు.. భారత పర్యాటకులకు ప్రత్యేక విజ్ఞ‌ప్తి చేశారు. భారతీయులు తమ దేశంలో పర్యటించాలని కోరారు. భారత పర్యాటకులు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్‌‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు, మోదీ లక్షద్వీప్ పర్యటనపై ఆయన ప్రభుత్వ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో భారత్‌-మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలోనే ఆయన నుంచి ఈ స్పందన వచ్చింది.


  ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. సముద్రంలో స్నార్కెలింగ్‌ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ.. ఆ ఫొటోలను మోదీ షేర్‌ చేశారు. దీనిపై అక్కసు వెళ్లిగక్కిన అప్పటి మాల్దీవుల మంత్రులు.. లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. దాంతో సోషల్‌ మీడియాలో నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్త చేయగా.. బాయ్‌కాట్ మాల్దీవ్స్‌ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇదే సమయంలో భారత్‌ బలగాలు తమ దేశం విడిచి వెళ్లాలంటూ ముయిజ్జు చేసిన ప్రకటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదాలు మాల్దీవుల ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన పర్యటక రంగంపై పెను ప్రభావం చూపాయి.


భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపి భారీమూల్యాన్ని చెల్లించుకుంది. పెద్ద సంఖ్యలో మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకులు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో భారతీయుల వాటా పడిపోయింది. గతేడాది డిసెంబరు 31 వరకు 2,09,198 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించగా.. ఆ దేశం పర్యాటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కానీ, వివాదం తర్వాత అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్‌ ఐదో స్థానానికి పడిపోయింది. కేవలం 13,989 మంది మాత్రమే మాల్దీవులను ఆ నెలలో సందర్శించారు.. చైనా అనుకూలుడిగా ముద్రవేసుకున్న ముయుజ్జు.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తుర్కియే, చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి ముయిజ్జు హాజరుకావడంతో ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు పలు సంకేతాలు వెలువడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com