ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోఫాలు, ఏసీలు కూడా ఎత్తుకెళ్లిపోయారు.. తేజస్వీ యాదవ్‌‌పై బీజేపీ ఫైర్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 09:34 PM

రాష్ట్రీయ జనతా దళ్ ముఖ్య నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు.. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై ఆ రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌గా ఉన్న సమయంలో కేటాయించిన ప్రభుత్వ అధికారిక నివాసంలో ఉన్న ఆయన.. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేసే సమయంలో అందులో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్లిపోయారని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. అయితే బీజేపీ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆర్జేడీ నేతలు స్పందించలేదు.


నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా.. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి బీహార్‌లో అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఇక డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత.. కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలగడంతో.. ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జేడీయూ-బీజేపీ కలిసి అధికారాన్ని చేపట్టగా.. తిరిగి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పటివరకు డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్.. తన పదవిని కోల్పోయారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని తేజస్వీ యాదవ్ ఖాళీ చేయాల్సి వచ్చింది.


అయితే ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసే సమయంలో అక్కడ ఉన్న చాలా వస్తువులను తేజస్వీ యాదవ్‌ తన వెంట తీసుకెళ్లినట్లు బీజేపీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అందులోని ఏసీ, సోఫాలు, బెడ్‌, పూల మొక్కల కుండీలు, జిమ్‌లోని వస్తువులు, వాష్‌రూమ్‌లోని నల్లాలు కూడా తేజస్వీ యాదవ్ తీసుకెళ్లిపోయారని బీజేపీ మీడియా ఇంఛార్జ్ డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. అయితే పదవి పోవడంతో.. కొత్త డిప్యూటీ సీఎంగా ఎన్నికైన సామ్రాట్ చౌదరీకి రాజధాని పాట్నాలోని ఆ ఇంటిని బీహార్ ప్రభుత్వం కేటాయించింది.


ఇందులో భాగంగానే గత ఆదివారం తేజస్వీ యాదవ్ ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా అన్ని వస్తువులు కనిపించలేదని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ భవనంలోని ఏ ఏ వస్తువులను తేజస్వీ యాదవ్ తీసుకువెళ్లారు అనే లిస్ట్‌ను త్వరలోనే విడుదల చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. ఇక ప్రభుత్వ అధికారిక నివాసంలోని వస్తువులు కనిపించకుండా పోవడం ప్రస్తుతం బీహార్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఈ ఆరోపణలపై తేజస్వీ యాదవ్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com