ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో యువతి హనీట్రాప్.. అమెరికా నుంచి వచ్చిన యువకుడు.. ఇంటికి పిలిచి ఆ ఫోటోలు, వీడియోలతో!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:47 PM

విశాఖపట్నంలో సరికొత్త హనీట్రాప్ కేసు సంచలనంగా మారింది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని యువకుడిని ట్రాప్ చేసి.. వీడియోలు, ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసింది. అతడి దగ్గర నుంచి డబ్బులు లాగేసి ఇంట్లో నిర్బంధించింది.. ఆమె నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. షీలానగర్‌కు చెందిన యువకుడి కుటుంబం అమెరికాలో ఉంటుంది.. అతడికి ఇన్‌స్టా ద్వారా మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన యువతి పరిచయమైంది. ఆ యువకుడి తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు.. మెల్లిగా అతడి ద్వారా అడ్రస్ తెలుసుకుంది.


యువతి నేరుగా షీలానగర్ వెళ్లి యువకుడి తల్లిదండ్రుల్ని కలిసింది.. వారితో పరిచయం పెంచుకుని నమ్మకం కలిగేలా చేసింది. 'నేను మీ అబ్బాయి స్నేహితురాలిని.. అతడంటే నాకు ఇష్టం.. పెళ్లి చేసుకుంటానని' చెప్పింది. యువకుడి తల్లిదండ్రులు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు.. యువతి వెంటనే ప్లాన్ మార్చేసింది. ఆ యువకుడికి మాయ మాటలు చెప్పి అమెరికా నుంచి విశాఖపట్నం రప్పించింది. ఆమె నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లింది.. యువకుడికి మాయ మాటలు చెప్పి మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది.


యువకుడికి మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్, డ్రింక్స్ ఇచ్చి.. కొన్ని స్ప్రేలు ఉపయోగిస్తూ.. అతడు మైకంలో ఉన్నప్పుడు.. అతడితో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు తీయించింది. ఆ ఫోటోలతో యువకుడ్ని బ్లాక్‌మెయిల్ చేసింది.. తాను తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని చెప్పినా వినిపించుకోలేదు. కొంతమంది తన అనుచరులతో యువకుడ్ని బెదిరించింది.. ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా యువకుడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. యువకుడితో ఏకంగా రూ.5లక్షలు ఖర్చు చేయించింది.


యువకుడి ఫోన్ బ్లాక్ చేసిన ఆ యువతి.. నిశ్చితార్థం, వారు సన్నిహితంగా ఉన్న ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్ లోని తన ఇంట్లో అతడ్ని మళ్లీ నిర్బంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. కేసు నమొదైతే అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేసింది. యువకుడు ఆమె ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పట్టుకుని కత్తితో చంపడానికి ప్రయత్నించింది. యువకుడు ఈ నెల 4న ఆమె ఇంటి నుంచి తప్పించుకుని.. భీమిలి పోలీసుల్ని ఆశ్రయించాడు.


యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మురళీనగర్‌లో యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. వీరందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఈ యువతి, ఆమె స్నేహితులు ధనవంతులైన అబ్బాయల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువతి స్నేహితులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అంతేకాదు అబ్బాయిల్ని ఎలా ట్రాప్ చేయాలో ఓ ముఠా ఆ యువతికి శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. వీటిపైనా ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే అందరిని అరెస్ట్ చేస్తామన్నారు. అంతేకాదు ఆ యువతిపై విశాఖపట్నంలోనే కంచరపాలెం, భీమిలిలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com