ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రెజరీలో దాచిన పురాతన నాణేలు.. తెల్లారేసరికి మాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:11 PM

తిన్నింటి వాసాలు లెక్క బెట్టే రకం అనే సామెత వినే ఉంటారు. నమ్మకంగా ఉన్నవారికే వెన్నుపోటు పొడిచారనే సందర్భంలో ఈ సామెత ఉపయోగిస్తుంటారు. ఇలాంటి తరహా ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జిల్లా ట్రెజరీ కార్యాలయం ఉంది. ఇందులో పురాతన వస్తువులు సైతం భద్రపరుస్తుంటారు. అలాగే కొన్ని పురాతన నాణేలను కూడా దాచిపెట్టారు. అయితే ఇటీవల ఆ పురాతన నాణేలు కనిపించకుండాపోయాయి. ట్రెజరీలో పురాతన నాణేలు కనిపించకపోవటంతో జిల్లా ట్రెజరీ అధికారి ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ట్రెజరీలో దాచిన నాణేలు కనిపించడం లేదని రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


అయితే దర్యాప్తులో భాగంగా ట్రెజరీ అధికారికి ఎవరిపైనైనా అనుమానం ఉందా అనే వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. జిల్లా ట్రెజరీ అధికారి నలుగురు ఉద్యోగుల మీద అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో నలుగురు ఉద్యోగుల పేర్లు బయటకు రావటంతో వారిని సస్పెండ్ చేశారు. విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు, సస్పెండైన వారిలో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌, సబ్ ట్రెజరీ ఆఫీసర్, క్యాషియర్, అటెండర్ ఉన్నారు. మరోవైపు పోలీసులు అటెండర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వివరాలు రాబడుతున్నట్లు సమాచారం.


రాయితీ పేరుతో కుళ్లిపోయిన టమోటా


ప్రస్తుతం మార్కెట్లో టమోటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఒక్కోచోట కిలో 90 నుంచి రూ.100 వరకూ పలుకుతున్న పరిస్థితి. అయితే కడప రైతుబజారు వద్ద మాత్రం టమాటాలను పారబోశారు. అదేంటీ ఇంత రేటు ఉన్న సమయంలో టమాటాలను ఎవరైనా పారపోస్తారా అనుకుంటున్నారా.. అదీ అధికారుల నిర్వాకం మరి. టమాటా ధరలు పెరగటంతో సామాన్యులకు ఉపశమనం కల్గించేందుకు సబ్సిడీ ధరలకు టమాటాలు పంపిణీ చేయాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించారు.


ఇందులో భాగంగా తోటల వద్దే రైతుల నుంచి కొనుగోలు చేసి కడప రైతు బజారుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వాటిలో సగానికి పైగా దెబ్బతిన్నాయి. దీంతో కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించలేదు. దీంతో చాలావాటికి బజారు బయట పారేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వ్యాపారులు మోసం చేయడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com