ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వేల ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 10:35 PM

 రైల్వేలను ప్రైవేటీకరిస్తారని గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చ జరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేలను ప్రైవేటుకు అప్పజెప్పుతున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైల్వేల ప్రైవేటీకరణ గురించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేలను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం దృష్టి మొత్తం రైల్వే ప్రయాణికులకు అందించాల్సిన సేవలపైనే ఉందని రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. దీంతో రైల్వేల ప్రైవేటీకరణ ఊహాగానాలకు తెరపడినట్లయింది.


నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా స్పష్టం చేశారు. తమ దృష్టి మొత్తం రైల్వే ప్రయాణికులకు తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించడం పైనే కేంద్రీకరించినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ రైజింగ్‌ డే కార్యక్రమంలో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్ రైల్వేల ప్రైవేటీకరణపై జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టారు. రూ.400 కన్నా తక్కువ ఖర్చుతో.. ప్రయాణికులకు 1000 కిలోమీటర్ల వరకు సౌకర్యవంతంగా ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో భారతీయ రైల్వేల్లో పూర్తిస్థాయిలో సమూల మార్పులు తీసుకువస్తామని స్పష్టం చేశారు.


ఇక స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక వందే భారత్‌, నమో భారత్‌ వంటి రైళ్లతో పాటు రైల్వే రక్షణ యంత్రాంగం కవచ్‌ ఏర్పాటు ద్వారా రానున్న 5ఏళ్లలో రైల్వేల రూపురేఖలు మార్చేస్తామని తేల్చి చెప్పారు. ఇది రైల్వేల పరివర్తన యుగంగా అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు. దేశానికి రైల్వేలు, రక్షణ వ్యవస్థ వెన్నెముకలాంటివని రైల్వేశాఖ మంత్రి తేల్చి చెప్పారు. అలాంటి రైల్వేలను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా కుండబద్ధలు కొట్టారు. రైల్వేల ప్రైవేటీకరణ విషయంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నవారు.. ఇది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.


రైల్వేల రాజకీయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెక్‌ పెట్టారని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం రైల్వేల పనితీరు, భద్రత, సాంకేతికత, తక్కువ ధరలకే ప్రయాణికలకు సేవలు అందించడంపైనే తాము దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఆర్‌పీఎఫ్‌ జోనల్ సెంటర్ల అప్‌గ్రేడ్‌కు రూ.35 కోట్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రైల్వే ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనలు, ప్రమోషన్లు వంటి డిమాండ్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన గత పదేళ్లలో దేశంలో కొత్తగా 31 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు నిర్మించినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com