ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్.. రూ.2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్ స్వాధీనం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 10:16 PM

దేశంలోకి డ్రగ్స్ రావడం, వాటిని వివిధ రాష్ట్రాలకు తరలించడాన్ని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పటికప్పుడు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ ఈ మత్తు పదార్థాల అక్రమ రవాణా మాత్రం అస్సలు ఆగడం లేదు. తాజాగా ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడటం పెను సంచలనంగా మారింది. ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఈ మత్తు పదార్థాలు 500 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల డ్రగ్స్‌ తరలిస్తూ పట్టుబడిన విదేశీయులను విచారిస్తున్న క్రమంలోనే.. ఈ భారీ డ్రగ్స్ ముఠా బాగోతాలు బయటికి రావడం గమనార్హం.


సౌత్ ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కొకైన్ పట్టుబడటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఏకంగా 500 కిలోల కొకైన్‌ను సీజ్ చేసిన పోలీసులు.. దాని విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. అయితే ఈ స్థాయిలో డ్రగ్స్ తరలింపు వెనక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉంటుందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసిన నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


అయితే ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలో మత్తుపదార్థాలతో పట్టుబడ్డారు. తిలక్ నగర్ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న ఆ ఇద్దరు ఆఫ్ఘన్ పౌరుల వద్ద తనిఖీలు చేయగా.. 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ దొరికింది. ఈ క్రమంలోనే వారిద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా మరో భారీ డ్రగ్స్ ముఠా పట్టుబడటం గమనార్హం.


తిలక్ నగర్‌లో నివసిస్తున్న ఆప్ఘనిస్థాన్‌కు చెందిన హషిమి మహ్మద్ వారిస్, అబ్దుల్ నయీబ్‌లు.. హెరాయిన్, కొకైన్‌తో పట్టుబడ్డారు. హషిమి మహ్మద్ వారిస్.. 2020 నుంచి ఆఫ్ఘనిస్థాన్ శరణార్థిగా భారత్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత మొదట ఓ షాపులో పనిచేసిన అతడు.. తన స్నేహితుడి ద్వారా డ్రగ్స్ ఊబిలో అడుగుపెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక అబ్దుల్ నయీబ్ కూడా 2020 నుంచి భారత్‌లో ఉంటున్నాడని చెప్పారు. వీరిద్దరికీ షాపులో పనిచేసే సమయంలో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత డ్రగ్స్ దందాలోకి దిగి.. ఢిల్లీ ఎన్సీఆర్‌ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com