ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదల్లో ఇంటర్ సర్టిఫికేట్లు పోయాయా?.. ఇలా చేస్తే ఫ్రీగా మీ చేతికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 09:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట నష్టం కూడా సంభవించింది. ఇళ్లల్లోకి వరదనీరు చేరటంతో సామాన్లు పాడయ్యాయి. వరదనీరు ముంచెత్తడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే వరదల కారణంగా చాలా మంది విద్యార్థులు తమ సర్టిఫికేట్లు కూడా కోల్పోయారు. ఇలాంటి వారికి ఏపీ ఇంటర్ బోర్డు శుభవార్త వినిపించింది. వరదల కారణంగా సర్టిఫికేట్లు కోల్పోయిన విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికేట్లను ఉచితంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. సర్టిఫికేట్లు కోల్పోయిన విద్యార్థులకు సర్టిఫైడ్ కాపీలు, డూప్లికేట్ సర్టిఫికేట్లు ఉచితంగా ఇవ్వాలంటూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు.


వరదల్లో సర్టిఫికేట్లు కోల్పోయిన విద్యార్థులకు ఉచితంగా సర్టిఫికేట్లు ఇస్తున్న సంగతిని ప్రజలకు తెలిజేయాలని ఆర్ఐవోలు, డీఐఈవోలను ఇంటర్ విద్యామండలి ఆదేశించింది. అలాగే విద్యార్థులు తాము చదివిన కాలేజీకి, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నేరుగా ఇంటర్ బోర్డును సంప్రదించడం ద్వారా కూడా డూప్లికేట్ సర్టిఫికేట్లను పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి ఫీజు అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇవ్వాలని ఇటీవల ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.


మరోవైపు విజయవాడ వరదల్లో విద్యార్థుల సర్టిఫికేట్లతో పాటుగా చాలా మంది ఆధార్ కార్డులు, జనన, మరణ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, వాహనాల డాక్యుమెంట్లు సైతం కోల్పోయారు. ఇలాంటి వారికి సర్టిఫికేట్లు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్పెషల్ డ్రైవ్ ద్వారా సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లు కోల్పోయిన వారికి తిరిగి అందజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక వరదల్లో వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నవారికి సంబంధించిన బీమా క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కలెక్టరేట్లో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ సైతం ఏర్పాటు చేశారు. అలాగే డాక్యుమెంట్ల విషయంలోనూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని స్థానికులు కూడా కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com