ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పవన్ కళ్యాణ్ చేతిలో 'ఎర్ర బుక్'.., అందులో ఏముందంటే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 07:32 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు.. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చేపట్టన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో విరమించారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.


పవన్ కళ్యాణ్ దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం బయట మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. ఈ వారాహి డిక్లరేషన్ బుక్‌ను సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. తిరుపతిలో గురువారం జరిగే వారాహి సభలో.. వారాహి డిక్లరేషన్ పుస్తకంలోని అంశాలను ప్రజలకు డిప్యూటీ సీఎం తెలియజేయనున్నట్లు సమాచారం. రెడ్‌ కలర్‌లో ఉన్న ఆ బుక్‌ కవర్‌ పేజీ పై భాగంలో '!! ధర్మో రక్షతి రక్షితః !!' అని రాసి ఉంది. అలాగే బుక్ మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం.. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్‌ అని ఉంది. బుక్ కింద భాగంలో తిరుపతి 03-10-2024 అని ప్రింట్ చేసి ఉంది.


ఆ వారాహి డిక్లరేషన్ బుక్‌లో ఎలాంటి అంశాలు పొందుపర్చారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఆ బుక్ గురించి అందరూ చర్చించుకున్నారు. అందులో ఏముందనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం తిరుపతిలో జరిగే వారాహి సభలో వారాహి డిక్లరేషన్‌ బుక్‌లోని అంశాలను ప్రజలకు పవన్‌ కళ్యాణ్ తెలియజేస్తారని జనసేన పార్టీ చెబుతోంది. గురువారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని బాలాజీ కాలనీ సర్కిల్, ఎస్వీ మ్యూజిక్‌ కాలేజీ దగ్గర ఎస్వీయూ క్యాంప్‌ స్కూల్‌లో వారాహి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.


మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తరిగొం వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రానికి వెళ్లారు. అక్కడ అన్నప్రసాదాన్ని పవన్ స్వీకరించారు.. అక్కడ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం గాయత్రి నిలయానికి వెళ్లారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజనీ తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చారు. పొలెనా మైనర్ కావడంతో.. ఆమెతో పాటూ పవన్ కళ్యాణ్ తండ్రిగా డిక్లరేషన్‌ పత్రాలతో సంతకం చేశారు. టీటీడీ నిబంధనల్ని అనుసరించి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తెకు డిక్లేరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు ఈ డిక్లరేషన్‌ను తీసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాన్ తిరుమల పర్యటన సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించారు. ఆలయం దగ్గర గొల్లమండపంకే మీడియాను పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ గురువారం కూడా తిరుమలలోనే ఉంటారు.


పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అలిపిరికి వచ్చి.. అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి కాలి నడకన తిరుమలకు బయల్దేరారు. పవన్ కళ్యాణ్ మెట్లు ఎక్కే క్రమంలో అలసటగా కనిపించారు.. మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకున్నారు. మోకాళ్ల పర్వతం తర్వాత కాళ్ల నొప్పి ఎక్కువగా ఉండటంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరుమలకు చేరుకున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అందరి కళ్లు వారాహి డిక్లరేషన్ బుక్‌పైనే ఉందని చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com