ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాగు ఒడ్డున బంగారు వర్ణంలో హనుమాన్ విగ్రహం.. చూసేందుకు జనం క్యూ, ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 07:44 PM

అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులో హనుమాన్ విగ్రహం కొట్టుకువచ్చింది. రాజవొమ్మంగి మండలం జడ్డంగి దగ్గర మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం వరదకు కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది. వాగు నీటి నుంచి ఒడ్డుకు చేరి ఇసుక దిబ్బల్లో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. హనుమంతుడి విగ్రహం బంగారు వర్ణంలో మెరిసిపోయింది.. విగ్రహాన్ని ఇసుక నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి జడ్డంగి రామాలయంలో ఉంచారు. హనుమాన్ విగ్రహాన్ని మంచి ముహూర్తం చూసి ప్రతిష్ఠిస్తామని గ్రామ పెద్దలు తెలియజేశారు. హనుమంతుడి విగ్రహం వాగులో కొట్టుకొచ్చిందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు భారీగా తరలివచ్చారు. నదులు, వాగుల్లో విగ్రహాలు వరదల సమయంలో కొట్టుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎక్కడన్నా ఆలయాల్లోని విగ్రహం ఇలా వరదలో కొట్టుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం మీద హనుమంతుడి విగ్రహం అంశం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశం అయ్యింది.


మారేడుమిల్లిలోని పర్యటక ప్రదేశాల్లో కనీస సదుపాయాలు లేకుండా పోతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. మారేడుమిల్లి, వాలమూరు, టైగర్‌క్యాంపు ప్రాంతాలతో పాటు, గుడిస కొండను పర్యటకంగా కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో-టూరిజంలో భాగంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి ప్రతి రోజూ వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో పర్యాటకులకు కనీస సదుపాయాలు లేవంటున్నారు. కొన్నిప్రాంతాల్లో కనీసం రహదారి కూడా లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. కొండపై కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని.. పాములేరు వాగులో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.


మరోవైపు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పర్యాటక ప్రాంతాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. శుక్రవారం కైలాసగిరి, వుడాపార్కు, డాక్టర్‌ వైఎస్సార్ సెంట్రల్‌పార్కు, తెలుగు మ్యూజియం, సబ్‌మెరైన్, టి.యు.142, సీ హారియర్‌ మ్యూజియం తదితర సందర్శన ప్రాంతాల్లో ప్రవేశం ఉచితం. అంతేకాదు భీమిలి, తొట్లకొండ, రుషికొండ, ఆర్‌కే బీచ్, కైలాసగిరి, యారాడ, కొండకర్లఆవ, అనంతగిరి, బొర్రా గుహలు, అరకు, లంబసింగి కూడా ఉచితంగా ప్రవేశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com