ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు సంబంధించిన అనుమతులు, వివిధ రాయితీలు మంజూరు తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా పరిశ్రమల ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీకి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద ఏర్పాటు చేస్తున్న కాస్టిక్ సోడా తయారీ యూనిట్ అంశం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద ఏర్పాటు చేసిన మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్,డోయర్ మెరైన్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్నకు సంబంధించిన అంశాలపై చర్చించారు. స్పష్టమైన ప్రతిపాదనలతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉండి ముందుకు వచ్చే వారికి సకాంలో తగిన అనుమతులు, వివిధ రాయితీలు కల్పించడం ద్వారా వెంటనే పరిశ్రమలు స్థాపనకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ అనిల్చంద్ర పునేఠ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో పరిశ్రమల స్థాపనకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఇంధన, ఐటి శాఖల ముఖ్య కార్యదర్శులు అజయ్ జైన్, విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, పరిశ్రమల శాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.