ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఆస్తుల వివరాలు సైతం ప్రజలకి తెలియాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 11:52 AM

ప్రభుత్వ ఆస్తులను తనఖాలు పెట్టేసిన గత పాలకులు.. దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా? అనే సందేహం ప్రజల్లో ఉందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘టీటీడీ ఆస్తులు, ఆభరణాలతో పాటు దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలూ, సత్రాల ఆస్తుల వివరాలు, సదరు ఆస్తుల ద్వారా వస్తున్న రాబడినీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తద్వారా దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండటంతో పాటు ఆలయాల పాలక మండళ్లు జవాబుదారీతనంతో పని చేస్తాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. టీటీడీకి సంబంధించిన ఆస్తులే కాకుండా దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని సీఎం చంద్రబాబును కోరారు. 


‘తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో భక్తులు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిరర్థకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలోని టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చింది. అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికే ఎందుకు ఉత్సాహపడింది? వారిని ఆ విధంగా నడిపించింది ఎవరనేది బయటకు తీస్తాం. స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించిన వారు కాపాడారా? అమ్మేశారా? అన్న సందేహాలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుంది. ఈ క్రమంలో గత పాలక మండళ్లు టీటీడీ ఆస్తుల విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘వైసీపీ హయాంలో టీటీడీ పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని, ఆ ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారు. నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మేము బలంగా, బాధ్యతగా స్పందించడంతో వేలం ఆగింది’ అని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారికి కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు ఇచ్చిన నగలు, ఆభరణాల జాబితాను కూడా పరిశీలించి, వాటి పరిస్థితిని కూడా గణించాలని టీటీడీ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఎందుకంటే స్థిరాస్తులను అమ్మేయాలని చూసిన వాళ్లు ఆభరణాలు, బంగారం విషయంలో కూడా కచ్చితంగా పెడపోకడలతో ఏవైనా అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నారా? అనేది తేల్చాల్సి ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com