ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఓ సామాన్యుడిలా ఇంటింటికి వెళ్లి అందరినీ కలిసి భరోసా ఇచ్చారన్నారు. యువకులమైన తమకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేశారని.. అందరి తరపున ఆయనకు కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆ వయసులో కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి దొరకడం ఏపీ ప్రజల అదృష్టమన్నారు. ఇలాంటి సమయంలో మానవతా దృక్పథంతో అందరూ కలిసికట్టుగా రావాలని.. కానీ ప్రతిపక్షం వాళ్లు మాయ మాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వాళ్లు ఏమి చేసినా పప్పులు ఉడకటం లేదు కాబట్టి సహించుకోలేకపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలలో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రజలు వాళ్లకు చూపించారన్నారు. అయినా ఇంకా వాళ్ళ స్టైల్ మార్చుకోకుండా రాజకీయాలు చేస్తూ ఉంటే ఆ 11 కూడా వాళ్లకు ఉంటాయో లేదో డౌట్గా ఉంది అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు చేశారు.