అమరావతి: ఎరువులు, విత్తనాలు దొరక్క 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయారని చెప్పారు. విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకుని రాత్రిపూట పొలాలకు వెళ్లిన రైతులు చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని చంద్రబాబు వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసనసభలో చేపట్టిన లఘుచర్చలో సీఎం మాట్లాడారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని చెప్పారు. వ్యవసాయానికి కేటాయింపులే కాకుండా అభివృద్ధి కూడా చేయగలిగామన్నారు. వ్యవసాయంలో రాష్ట్ర వృద్ధి 11శాతం ఉండగా.. దేశంలో 2.4శాతం ఉందని చెప్పారు. రైతుల ఆదాయం పెరిగేలా చేశామని.. సూక్ష్మసేద్యంలో దేశంలోని తొలి 10 జిల్లాల్లో ఆరు ఏపీలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండాలనేదే లక్ష్యమని అన్నారు. వ్యవసాయానికి కేటాయింపులే కాకుండా అభివృద్ది కూడా చేస్తున్నామన్నారు. మన రైతుల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు కావాలన్నారు. దేశానికి కావాల్సిన ఆక్వా ఉత్పత్తులన్నీ ఇక్కన్నుంచే అందిస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం తీసుకొస్తున్నామన్నారు.