ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శల దాడికి దిగారు బీజేపీ చీఫ్ అమిత్ షా. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఏపీ అభివృద్ధికి సహకారం అందిస్తుంటే.. చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోగానే.. మహాకూటమి అంటూ చంద్రబాబు కొత్తపల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతో జతకలిశారని విమర్శించారు. అంతకు ముందు, 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీకి లక్షా 72వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని.. 2014 నుంచి ఇప్పటివరకూ బీజేపీ ప్రభుత్వం ఏపీకి రూ. 5.56 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా పేదవారికి 2 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే.. అందులో 10 లక్షల ఇండ్లను ఏపీకే కేటాయించిందని గుర్తు చేశారు.
విజయనగరం జిల్లాలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన అమిత్ షా.. ఏపీకి ఇచ్చిన 14 హామీల్లో ఇప్పటికే 10 అమలు చేశామని చెప్పారు. 20 జాతీయ స్థాయి సంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. దీనిపై చంద్రబాబు చర్చకు సిద్ధమా? అని అమిత్ షా సవాల్ విసిరారు. ఏపీ ప్రజల్లో చంద్రబాబు పాలనపై తీవ్రమైన వ్యతిరేకత, కోపం ఉన్నాయని.. వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీపై అబాండాలు వేస్తున్నారని ఆరోపించారు. ఏపీ కోసం ప్రత్యేక హోదాకు మించి నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినా.. చంద్రబాబు సరైన ప్రణాళికతో ముందుకు రాలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై అప్పుడు శాసనసభలో ప్రశంసలు కురిపించిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని బీజేపీ మహిళా నేతలను చంద్రబాబు బెదిరిస్తున్నారని, అంతం చూస్తామంటున్నారని.. అలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని అమిత్ షా స్పష్టం చేశారు. అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలు దొందూ దొందేనని, ఆ రెండూ కుటుంబ పార్టీలేనని.. వాటికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీ సహకారం లేకుండా ప్రభుత్వం ఏర్పడబోదని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా.