ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌తో చర్చలు జరిపే కాలం ముగిసింది: మంత్రి జై శంకర్‌

national |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 09:48 PM

భారత్‌లోకి ఉగ్రవాదాన్ని పంపిస్తూ.. దాడులకు కారణం అవుతున్న పాకిస్తాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు. చర్చలు కాకుండా ఇక నుంచి పాకిస్తాన్‌తో ఎలా వ్యవహరించాలన్న దానిపైనే ప్రస్తుతం భారత్‌ ఆలోచన చేస్తోందని వెల్లడించారు. ఢిల్లీలో తాజాగా నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జై శంకర్.. భారత్, పాక్ సంబంధాల గురించి స్పందించారు. పాకిస్తాన్‌ విషయంలో భారత్ ఏ రకంగా స్పందిస్తుంది అనే విషయంపై మాట్లాడిన జై శంకర్.. భారత్ పట్ల పాక్ వ్యవహార శైలి ఆధారంగానే.. ఆ దేశం పట్ల భారత్ తీసుకునే చర్యలు, నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఒక వేళ భారత్ విషయంలో పాక్ కుట్రలు, కుటిల యత్నాలకు ప్రయత్నిస్తే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు.


పాకిస్థాన్‌పై భారత్ వైఖరి గురించి అనేది.. పాక్‌ వ్యవహరించే తీరును బట్టి ఉంటుందని.. అందుకు తగినవిధంగా బదులిస్తామని జై శంకర్ చెప్పారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా భారత్‌.. చర్యలు చేపడుతుందని వివరించారు. పాక్‌ భూభాగంలో జరుగుతున్న ఉగ్ర కుట్రలు.. భారత్‌పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడంపై.. ఆ దేశం తగిన పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఇక గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో తరచుగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనల కారణంగా భారత్, పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.


ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గానీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు అనేది ఒక ముగిసిన అధ్యాయం అని జైశంకర్‌ తెలిపారు. మరోవైపు.. ఈ ఏడాది మార్చిలో సింగపూర్‌లో పర్యటించిన జై శంకర్‌.. పాక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్‌.. ఒక ఫ్యాక్టరీ లాగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. అయితే ఉగ్రవాదాన్ని ఉపేక్షించే స్థితిలో ప్రస్తుతం భారత్‌ లేదని అన్నారు. ఈ ఉగ్రవాద సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉందని.. ప్రతి దేశం ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుందని చెప్పారు. కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుందని జై శంకర్ అభిప్రాయపడ్డారు.


మరోవైపు.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న రాజకీయ సంక్షోభం గురించి జైశంకర్‌ స్పందించారు. షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడినప్పటి నుంచి ఆ దేశం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులతో వారి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో ప్రతీ దేశానికి సమస్యలు ఉంటాయని.. అయితే పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇక ప్రధాని మోదీ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో మాట్లాడారని.. మైనారిటీలు, హిందువుల భద్రతకు ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని జై శంకర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com