ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మ వద్దు, కిడ్నాపర్ కావాలి.. 2 ఏళ్ల బాలుడి మారాం

national |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 09:45 PM

సాధారణంగా చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్‌ అంటే అందరికీ భయమే. తనను ఎక్కడికి ఎత్తుకెళ్తున్నాడో.. తన తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాడని చిన్న పిల్లలు భయపడితే.. తమ పిల్లాడిని ఏం చేస్తాడో, ఎవరికైనా అమ్మేస్తాడో లేక చంపేస్తాడో అని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. ఇక చిన్న పిల్లలను ఎవరు ఎత్తుకున్నా, ఎంత లాలించి ఆడించినా.. అమ్మ కనబడగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు. అమ్మ ప్రేమ అలాంటిది. అయితే ఈ పసిపిల్లాడు మాత్రం.. తల్లిదండ్రులను కాదని కిడ్నాపర్‌ చెంతనే ఉండేందుకు ఇష్టపడ్డాడు. చివరికి తల్లిదండ్రులకు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఏడుపు అందుకున్నాడు. ఇక ఆ పిల్లాడిని తల్లిదండ్రులకు ఇచ్చే సమయంలో ఆ కిడ్నాపర్ కూడా కంటతడిపెట్టుకోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే?


రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటన తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తనూజ్ చాహర్ అనే వ్యక్తి రిజర్వ్ పోలీస్ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. ఓ కేసు విషయంలో తనూజ్ చాహర్ సస్పెండ్ అయ్యాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌కు చెందిన పృథ్వీ అనే నెలల చంటిబిడ్డను ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత పోలీస్‌గా పనిచేసిన అనుభవంతో ఎవరికీ దొరకకుండా ఆ పిల్లాడిని పట్టుకుని వేర్వేరు ప్రాంతాల్లో తిరిగాడు. పైగా సెల్‌ఫోన్ కూడా వాడకపోవడంతో పృథ్వీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. అయినా పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టడంతో ఎట్టకేలకు 14 నెలల తర్వాత దొరికాడు.


ఈ క్రమంలోనే పృథ్వీని.. తనూజ్ చాహర్ నుంచి విడదీసేందుకు ప్రయత్నించగా.. ఆ బాలుడు అందుకు నిరాకరించాడు. తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పినా ఆ బుడ్డోడు మాత్రం తాను కిడ్నాపర్ తనూజ్ చాహర్ వద్దే ఉంటానని మొండికేశాడు. అది చూసి పోలీసులతోపాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఊహ తెలియని వయసులో తనను ఎత్తుకెళ్లి.. ఏడాదికి పైగా చూసుకున్న కిడ్నాపర్‌ను వదిలిపెట్టేందుకు పృథ్వీకి మనసు రాలేదు. ఇక అమ్మానాన్న వద్దకు వెళ్లేందుకు కూడా మొండికేశాడు. చివరికి పోలీసులు బలవంతంగా తనూజ్ చాహర్ నుంచి విడదీసి.. పృథ్వీని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించగా.. ఏడుపు మొదలుపెట్టాడు. ఇక పృథ్వీని తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో అతడ్ని కిడ్నాప్ చేసిన తనూజ్ చాహర్‌ కూడా కంటతడి పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.


ఇక ఈ బాలుడిని ఎత్తుకెళ్లిన తనూజ్ చాహర్.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుతూ.. షేవింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు వేషాలు మార్చేవాడు. పృథ్వీని వెతుకుతున్న పోలీసులు, తల్లిదండ్రులను 14 నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతడిని అలీఘర్‌లో అరెస్ట్‌ చేసి జైపూర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.


 అయితే చివరికి తనూజ్ చాహర్ ఆ చిన్న పిల్లాడిని ఎత్తుకెళ్లడానికి గల కారణాన్ని పోలీసులు గుర్తించారు. పృథ్వీ తల్లి పూనమ్‌ చౌదరిని తనతో వచ్చేయాలని తనూజ్‌ చాహర్ గతంలో ఒత్తిడి చేశాడని.. అందుకు ఆమె నిరాకరించిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న తనూజ్ చాహర్.. ఆమె బిడ్డను కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. పృథ్వీని తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత తనూజ్ చాహర్‌ను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com