ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"పుష్ప"లకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఇక అదే వారికి ఆఖరి రోజు అని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 07:44 PM

ఎర్రచందనం అక్రమ రవాణాపై కొరఢా ఝళిపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎకో పార్కు ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వేప, రావి చెట్లను నాటారు. ప్రతి ఒక్కరూ ప్రతీ సంవత్సరం కనీసం 2 మొక్కలు అయినా నాటాలని సీఎం పిలుపునిచ్చారు.


ఇక రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ అవుతోందని.. అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లర్లకు సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లర్లు అడవుల్లో అడుగుపెడితే.. అదే చివరి రోజు అని.. వారిని డ్రోన్లతో వెంటాడి పట్టుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ఈ క్రమంలోనే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఎర్రచందనం స్మగ్లర్లను పెంచి పోషించిందని మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్లకు ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం స్మగ్లర్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని తేల్చి చెప్పారు.


వనమహోత్సవం అనేది ఎంతో మహత్తరమైన కార్యక్రమమని.. అది తనకు ఎంతో ఇష్టమని చంద్రబాబు అన్నారు. మొక్కలు నాటడంలోని ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలని ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్రంలో పచ్చదనం 50 శాతానికి పెరగాలని సీఎం తెలిపారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే చాలా మంది ఎగతాళి చేసేవారని.. కానీ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరమని చెప్పారు. అడవులు తగ్గిపోవడంతో భూతాపం, కాలుష్యం బాగా పెరుగుతోందని.. దాని వల్ల పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని సూచించారు.


గత వైసీపీ ప్రభుత్వంలో నదులు, చెరువులు, కొండలను కూడా ధ్వంసం చేశారని చంద్రబాబు తెలిపారు. బ్రహ్మంగారు నివసించిన రవ్వలకొండను కూడా గత పాలకులు తవ్వేశారని.. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకెళ్తామని.. హైదరాబాద్‌లో కొండలు, రాళ్లు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లోనే మొక్కలు నాటినట్లు చెప్పారు. మిషన్‌ హరితాంధ్రప్రదేశ్‌కు 2014లోనే శ్రీకారం చుట్టామని.. డ్రోన్‌ల ద్వారా సీడ్‌ బాల్స్‌ వేసే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గాల్లో నగరవనాలు ఏర్పాటు చేస్తామని.. జపాన్‌లోని మియావకీ విధానంలో పచ్చదనం పెంచుతామని చంద్రబాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com