ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ తరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియచేద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 07:23 PM

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుగు భాషా దినోత్సవంపై స్పందించారు. తెలుగు భాష తీయదనాన్ని భావి తరాలకు అందిద్దామన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన అమ్మ భాషను గౌరవించుకొందామన్నారు. నవ తరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియచేద్దామన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకువచ్చి రచనలు చేయడం వల్లే భాషా సౌందర్యం ఇనుమడించిందని పవన్ అన్నారు. ఇందుకు వ్యావహారిక భాషోద్యమ మూల పురుషుడు గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకొంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తికి అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచి మన విద్యార్థులకు తెలుగు భాష నేర్పించడం ద్వారా మాతృ భాష విలువ తెలియడమే కాదు... వారి ఆలోచన పరిధి విస్తృతమవుతుందన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ తెలుగు భాష వినియోగం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. నిత్య వ్యవహారంలోనూ మన భాషకు పట్టం కట్టినప్పుడే తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూరుతుందని పవన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com