ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇచ్చిన రెండు రోజులకే..,,మేయర్ ఇంటిపైకి చెత్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 09:02 PM

కడపలో చెత్త సేకరణపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయం వేడెక్కింది. కడపలో చెత్త సేకరించకపోతే మేయర్ ఇంటి వద్ద చెత్త వేస్తానంటూ కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి రెండురోజుల కిందట హెచ్చరించారు.ఈ క్రమంలోనే కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు , కొంతమంది ప్రజలు చెత్త పారబోశారు. కడపలో చెత్త సేకరణ జాప్యం చేయడానికి మేయర్ సురేష్ బాబు కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై మేయర్ ఆరోపణలు చేయటంతో సురేష్ బాబు మీద మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం సురేష్ బాబు ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మేయర్ ఇంటి వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ఆయన ఇంటి వద్ద చెత్తను వేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.


అయితే ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా మేయర్ ఇంటి వద్దకు చేరుకోవటంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మేయర్ సురేష్ బాబుకు మద్దతుగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవటంతో.. ఉద్రిక్తత తలెత్తింది. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే కడపలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు.. ధర్నాకు దిగాయి. మేయర్ సురేష్ బాబుతో పాటుగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించాయి. టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశాయి.


అసలు విషయానికి వస్తే.. కడపలో చెత్త పన్ను వసూలు చేయాలని కార్పొరేషన్ సిబ్బందికి కడప మేయర్ సురేష్ బాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేయవద్దని చెప్పిందని.. వసూలు చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెత్త సేకరణ వాహనాలను మేయర్ తగ్గించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చెత్త వాహనాల సంఖ్యను తగ్గిస్తూ.. చెత్త సేకరణను ప్రభుత్వం వద్దని చెప్పిందని వైసీపీ కార్పొరేటర్లు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపిస్తున్నారు. అయితే చెత్త పన్ను వసూలు చేయకపోతే చెత్తను సేకరించే సిబ్బందికి జీతాలు ఎవరు చెల్లిస్తారని మేయర్ ప్రశ్నిస్తున్నారు. చెత్త పన్ను వసూలు వద్దని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. సిబ్బంది జీతాల చెల్లింపుపైనా స్పష్టత లేదంటున్నారు.


ఈ క్రమంలోనే కడపలో చెత్త సేకరణ జాప్యం చేస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. మేయర్ ఇలాగే వ్యవహరిస్తే కడప మేయర్ ఇంటి వద్ద చెత్త వేస్తానని హెచ్చరించారు. ఈ వార్నింగ్ నేపథ్యంలోనే కడప టీడీపీ నేతలు.. మేయర్ ఇంటి వద్ద చెత్త వేయడం.. అటు వైసీపీ శ్రేణులు కూడా మేయర్‌కు మద్దతుగా అక్కడకు చేరుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com