ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ రైల్వే స్టేషన్‌లో కూడా వందేభారత్‌ రైలు ఆగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో స్టేషన్‌లో కొత్తగా వందేభారత్‌ రైలుకు స్టాప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి వందేభారత్‌ రైలుకు ఏలూరులో హాల్ట్‌ మొదలైంది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ యాదవ్‌‌లు వందేభారత్‌ రైలుకు ఘన స్వాగతం పలికారు. ఏలూరు నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించారు. విశాఖపట్నం వైపు నుంచి రైలు సాయంత్రం 5.54 నిమిషాలకు ఏలూరుకు వచ్చి 5.55 నిమిషాలకు విజయవాడ వైపు బయల్దేరి వెళ్ళాల్సి ఉంది. అయితే ఆదివారం సాయంత్రం 6.08 నిమిషాలకు వందేభారత్ రాగా ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకుని 6.17 నిమిషాలకు విజయవాడ వైపు వెళ్లింది.


ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్,‌ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ రైలు ఎక్కి విజయవాడ వరకు తమ అనుచరులతో ప్రయాణించారు. రైలులో ఉన్న సౌకర్యాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. వందే భారత్‌కు ఏలూరులో హాల్ట్‌‌తో జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్‌. ఏలూరులో స్టాప్‌ ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, కేంద్ర రైల్వే మంత్రికి, రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైలు పగటి వేళ ప్రయాణం కొనసాగడం వల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏలూరు జిల్లాలో వ్యాపారులకు, ఉద్యోగస్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.


విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలుకు ఇటీవలే ఏలూరులో కొత్త స్టాప్‌ ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఈ రైలు ఏలూరులో ఆగుతోంది. మొన్నటి వరకు వందే భారత్‌ రైలుకు విజయవాడ- రాజమహేంద్రవరం మధ్యలో ఒక్క స్టాప్‌ కూడా లేకుండా పోయింది.. ఏలూరు జిల్లాకు చెందిన ప్రయాణికులు ఎప్పటి నుంచో ఏలూరులో స్టాప్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా చొరవ తీసుకుని రైల్వేశాఖకు రిక్వెస్ట్ చేయడంతో హాల్ట్ ఇచ్చారు.


ఈ వందేభారత్ రైలు (20707) సికింద్రాబాద్‌లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి.. ఉదయం 9.49 గంటలకు ఏలూరు వస్తుంది.. అక్కడి నుంచి 9.50కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ వందేభారత్ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35గంటలకు బయలుదేరి.. సాయంత్రం 17.54 గంటలకు ఏలూరు స్టేషన్‌కు చేరుకుని 17.55కి విజయవాడవైపు వెళుతుంది. ఏలూరులో ఈ వందేభారత్ రైలు ఆగడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏలూరులో వందేభారత్ స్టాప్ ఆదివారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com