ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌పై విమర్శలు చేయడమే అనిత ఎజెండాగా మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 09:46 PM

హోం మంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని, ఆమె ఒక అసమర్థ హోం మంత్రి అని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. బాధ్యతల నిర్వహణలో విఫలమైన అనిత, తన హోదాను మర్చి అనుచిత విమర్శలు చేస్తూ, నిందలు వేస్తున్నారని, కనీస విజ్ఞత, గౌరవ మర్యాదలూ వదిలేశారని ఆమె ఆక్షేపించారు. రోజూ తమ పార్టీపై, వైయ‌స్ జగన్‌గారిపై విమర్శలు చేయడమే అనిత ఎజెండాగా మారిందని అన్నారు. విశాఖపట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్య్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఎక్కడిక్కడ హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నా, హోం మంత్రి ఏనాడూ స్పందించలేదని, చివరకు ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురై అదృశ్యమైన బాలిక కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని గుర్తు చేశారు. అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేనే లేదని వరుదు కళ్యాణి తేల్చి చెప్పారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన బ్లాస్ట్‌పైనా హోం మంత్రి అబద్దాలు చెబుతున్నారన్న, వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు.. ఆ ఘటనలో బాధితులను ఆదుకోవడంలోనూ, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం జరిగితే, హుటాహుటిన డీజీపీ, సీఐడీ చీఫ్‌ను హెలికాప్టర్‌లో పంపిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. అచ్యుతాపురం సెజ్‌లో బ్లాస్ట్‌ తర్వాత, సహాయ చర్యల పర్యవేక్షణకు ఎవరినీ, ఎందుకు పంపలేదని నిలదీశారు. అంటే కాగితాలకు ఇచ్చిన విలువ, ఉత్తరాంధ్ర ప్రజలపై లేదా? అని సూటిగా ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com