ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానాశ్రయంలో టెలిగ్రామ్ అధినేత అరెస్ట్.. యాప్‌ సంబంధిత కేసులోనే

international |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 08:08 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పావెల్ దురోవ్‌‌ను విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్‌కు సంబంధిత నేరాల కేసులోనే దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు శనివారం పారిస్ సమీపంలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పారిస్ నగరానికి ఉత్తరాన ఉన్న లే బోర్గెట్ విమానాశ్రయంలో ఫ్రాంకో-రష్యన్ బిలియనీర్‌ను నిర్బంధించినట్లు అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీకి వెల్లడించారు. దురోవ్ అజర్‌ బైజాన్‌ రాజధాని బాకు నుంచి వస్తుండగా అరెస్ట్‌ చేసినట్లు కేసుకు దగ్గరగా ఉన్న మరొకరు తెలిపారు. దురోవ్‌ను కోర్టులో ఆదివారం హాజరుపరుస్తున్నట్లు సమాచారం.


 మైనర్లపై హింసను నిరోధించడంలో కృషి చేసే ఫ్రాన్స్‌కు చెందిన ఆఫ్మిన్‌ సంస్థ.. మోసం, డ్రగ్స్ అక్రమ రవాణా, సైబర్ బెదిరింపులు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తులో సమన్వయ ఏజెన్సీగా దురోవ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని కేసుకు దగ్గరగా ఉండే మరో అధికారి తెలిపారు. టెలిగ్రామ్‌ యాప్‌ను నేరాలకు ఉపయోగించకునే విషయంలో దురోవ్ చర్యలు తీసుకోనందునే క్రిమినల్ కేసు నమోదయ్యింది. ‘టెలిగ్రామ్‌ శిక్షార్హతకు సరిపోతుంది’ అని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు. వాంటెడ్ వ్యక్తి అని తెలిసి దురోవ్ పారిస్‌కు రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు.


దుబాయ్‌ కేంద్రంగా సేవలందించే టెలిగ్రామ్ యాప్.. అమెరికాకు చెందిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యామ్నాయంగా నిలిచింది. అయితే, ఇది వినియోగదారుల వ్యక్తిగత డేటాను వాణిజ్యపరమైన అంశాలకు వాడుకుంటోందనే విమర్శలు ఉన్నాయి. తన వినియోగదారుల గురించి ఎటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయకూడదనే నియమాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.


ఇక, ఏప్రిల్‌లో టక్కర్ కార్ల్‌సన్‌కి దురోవ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. వీకేలో చేస్తున్నప్పుడు రష్యన్ ప్రభుత్వం వేధింపులకు గురికావడంతో ఈ యాప్‌ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. 2014లో రష్యాను విడిచి వచ్చేసిన అతడు.. దుబాయ్ చేరడానికి ముందు బెర్లిన్, లండన్, సింగ్‌పూర్, శాన్‌ఫ్రాన్సిస్కో‌లో స్థిరపడాలని భావించారు. అయితే, దుబాయ్‌లో వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఉండటంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వ్యక్తిగత గోపత్యను కోరుకుంటున్నారు.. అందుకే ఎక్కువ మంది టెలిగ్రామ్‌ను ఎంచుకుంటున్నారు’ అని దురోవ్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com