వందేభారత్ రైల్లో తనిఖీలు జరిగాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్లో విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాంబాబు ప్రయాణించారు. విజయవాడ నుంచి సామర్ల కోట వరకు ఈ రైలులో విస్తృతంగా తనిఖీలు చేశారు. ప్రధానంగా కేటరింగ్ సేవలను, ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణాన్ని డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పరిశీలించారు. అలాగే వందేభారత్ రైలులో సౌకర్యాలు, ఇతర అంశాలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన సామర్లకోట స్టేషన్లో తనిఖీలు చేశారు.. అలాగే వివిధ విభాగాలను పరిశీలించారు. వందేభారత్ కార్యకలాపాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అంతేకాదు రైలు ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత భువనేశ్వర్ - ఎస్ఎంబీ బెంగళూరు ఎక్స్ప్రెస్లో పాంట్రీ కార్ను రాంబాబు తనిఖీ చేశారు. భద్రత, పరిశుభ్రత, ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి పలు సూచించారు.
మరోవైపు రైలు ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రైస్లో మరో స్టేషన్లో స్టాప్ ఇచ్చారు. ఈనెల 25 నుంచి వందే భారత్ రైలు ఏలూరులో కూడా ఆగుతుందని అధికారులు తెలిపారు. ఈ వందేభారత్ రైలుకు విజయవాడ- రాజమహేంద్రవరం మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు.. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఈ మేరకు ఏలూరులో కొత్తగా స్టాప్ ఏర్పాటు చేశారు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వందేభారత్ రైలు ప్రతి రోజూ సికింద్రాబాద్లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరుతుంది.. ఉదయం 9.49 గంటలకు ఏలూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.50కి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలాగే ఈ రైలు తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35గంటలకు బయలుదేరి.. సాయంత్రం 17.54 గంటలకు ఏలూరు స్టేషన్కు చేరుకుని 17.55కి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. ఏలూరులో కొత్తగా స్టాప్ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.