ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటరల్ ఎంట్రీ రద్దు చేస్తూ నిర్ణయం,,,వెనక్కి తగ్గిన మోదీ సర్కార్

national |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 10:51 PM

లేటరల్ ఎంట్రీ విధానాన్ని వెనక్కి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా పోస్టుల భర్తీపై నరేంద్ర మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. యూపీఎస్సీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. దీంతో యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూపీఎస్సీ ఛైర్మన్‌కు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.


యూపీఎస్సీ మొత్తం 45 జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ పోస్టులను లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉండే ఈ పోస్టులకు గాను ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేక వ్యక్తం అవుతుండటంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.


 ఈ లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా ప్రైవేట్ రంగంలో 15 ఏళ్ల అనుభవం కలిగి.. 45 ఏళ్ల వయసు దాటిన వారిని బ్యూరోక్రసిలో చేర్చుకునే వెసలుబాటు ఉంటుంది. సాధారణంగా లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా ఇతర గ్రూప్ A క్యాడర్‌కు చెందిన అధికారులుగా అవకాశం కల్పిస్తారు. అయితే ఈ లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా జరిగే రిక్రూట్‌మెంట్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కోటా, రిజర్వేషన్లు లేనందున కేంద్ర ప్రభుత్వ లాటరల్ ఎంట్రీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2005లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ విధానాన్ని మన్మోహన్ సింగ్ సర్కార్ ప్రవేశపెట్టింది. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాల్సిన ఈ పదవులను ఆయా రంగాల నిపుణులకు అవకాశం కల్పిస్తారు. వీరిని యూపీఎస్సీ నోటిఫికేషన్‍ ద్వారా భర్తీ చేస్తారు. అయితే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ పెద్ద ఎత్తున నియామకాలు చేయాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మోదీ సర్కార్ రిజర్వేషన్ల విధానానికి స్వస్తి చెబుతూ బ్యాక్ డోర్ ద్వారా నియామకాలు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలతోపాటు ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల నుంచి కూడా ఈ లేటరల్ ఎంట్రీ తీవ్ర ఒత్తిడి రావడంతో మోదీ ప్రభుత్వం ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com