జనసేన పార్టీకి ఓ నేత షాకిచ్చారు.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేత, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ సభ్యులు ఆలా శ్రీధర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను జనసేన పార్టీలో కొనసాగలేకపోతున్నానని శ్రీధర్ తెలియజేశారు. ప్రస్తుత రాజకీయాలు అవకాశవాదంగా మారాయని.. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు శ్రీధర్ ప్రకటించారు. జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్న శ్రీధర్ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ సభ్యులు కూడా వ్యవహరిస్తున్నారు. శ్రీధర్ రాజీనామా జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్న రాజకీయ కారణాలతోనే పార్టీని వీడినట్లు చర్చ జరుగుతోంది. శ్రీధర్ సోదరుడు అనిల్ కుమార్ కూడా జనసేన పార్టీలో ఉన్నారు. చీరాల నియోజకవర్గ సభ్యత్వ నమోదు పరిశీలకుడుగా బాధ్యతలు నిర్వహించారు.
శ్రీధర్
ఆలా శ్రీధర్ అధికారంలో ఉన్న జనసేన పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలతో ఆయన పార్టీని వీడారనే టాక్ వినిపిస్తోంది. ఆలా శ్రీధర్ మొదటి నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నారు.. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. అలాగే ఇటీవల పార్టీ చేపట్టిన సభ్యత్వాల నమోదులో చాలా యాక్టివ్గా పనిచేశారు.. సోషల్ మీడియా వేదికగా బాగా ప్రచారం చేశారు. చీరాల నియోజకవర్గం లో స్థానిక సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటి పరిష్కారం చేయటమే ఒక జనసైనికుడిగా భాధ్యత అంటూ ప్రకటించారు. మొన్నటి వరకు పార్టీలో కీలకంగా ఉన్న శ్రీధర్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా 4,518 మంది సభ్యత్వాలు నమోదయ్యాయి. ఆ తర్వాత రేపల్లె నియోజకవర్గంలో 3,514 మంది, పర్చూరు నియోజకవర్గంలో 3,334, వేమూరు నియోజకవర్గంలో 2,798, బాపట్ల నియోజకవర్గంలో 2,052, అద్దంకి నియోజవకర్గంలో 1,960 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. చీరాల నియోజకవర్గంలో సభ్యత్వాల కోసం విస్తృతంగా కృషి చేసిన పార్టీ శ్రేణుల్ని అభినందించారు.