ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీలో మంత్రి లోకేష్, ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 09:54 PM

ఏపీలో కొందరు వైఎస్సార్‌‌సీపీ నేతలు బీజేపీ చేరాలనుకుంటున్నారనే అంశం తెరపైకి వచ్చింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను బీజేపీలో చేర్చుకోబోతున్నారని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని.. అది వాస్తవమేనా? అని మంత్రి సత్యకుమార్‌ను అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తనకు తెలిసిన సమాచారం మేరకు అలాంటిదేమీ లేదని సత్యకుమార్‌ బదులిచ్చారు. ఒకవేళ ఎవరైనా బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే.. కూటమి పక్షాల నేతలు కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే బావుంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.


అంతేకాదు కూటమిలోని టీడీపీ, జనసేన బీజేపీలు కలిసి సమన్వయంతో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ఆలోచన బాగానే ఉందని లోకేష్ చెప్పగా.. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మంచి నిర్ణయమే అన్నారు. మొత్తానికి ఏపీలో వైఎస్సార్‌సీపీ నుంచి వలసలు ఖాయమనే చర్చ జరుగుతోంది. కొందరు నేతలు టీడీపీ, జనసేన, బీజేపీవైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే చేరికల విషయంలో మూడు పార్టీలు జాగ్రత్తలు వహిస్తున్నాయి.


మరోవైపు రాయలసీమకు చెందిన బీజేపీ నేతలు మాత్రం ఈ చేరికలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు, అక్రమార్కులు చేసినవారు, దొంగలకు,భూ కబ్జాదారులకు బీజేపీ పునరావాసం కాదని.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో అంటకాగిన వారిలో కొందరు ఇటీవల తమ పార్టీలో చేరడంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానంటున్నారు. కేంద్ర భవన నిర్మాణ సలహా మండలి ఛైర్మన్‌ శ్రీనివాసనాయుడు. కడప జిల్లాలో ఎలాంటి కేసులు లేని వారిని మాత్రమే పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు చెప్పారని.. కొందరు మాత్రం స్థానిక నేతల్ని ప్రలోభపెట్టి దొడ్డిదారిన పార్టీలోకి వచ్చారన్నారు.


కడప జడ్పీలో నిర్మించిన అక్రమ కట్టడాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు శ్రీనివాసనాయుడు. గత పాలనలో ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. కూటమి ప్రభుత్వం వారి సంక్షేమంపై దృష్టి పెట్టి, రాయితీలను కల్పించాలని కోరారు. వచ్చే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని.. ఆగస్టు నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com