ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువ భారత్‌ జోరు.. జింబాబ్వే బేజారు.. సిరీస్‌ 4-1తో వశం

sports |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2024, 09:59 PM

జింబాబ్వే గడ్డపై యువ భారత్‌ అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా ఆ తర్వాత బలంగా పుంజుకుని వరుసగా నాలుగు విజయాలు సాధించింది. సీనియర్లు లేకపోవడంతో అందివచ్చిన అవకాశాన్ని కుర్రాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహీత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్మెంట్ పలికిన నేపథ్యంలో మేమున్నామంటూ భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించారు.


ఆదివారం జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 167/6 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌ (12), శుభ్‌మన్‌ గిల్‌ (13)తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ అభిషేక్ శర్మ (14) కూడా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో జట్టులోని సీనియర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. రియాన్ పరాగ్‌(22), శివమ్ దూబె (26)తో కలిసి జట్టు స్కోరును 160 పరుగుల మార్కును దాటించాడు. చివరకు 45 బంతుల్లో 58 రన్స్‌ చేసి ఔట్‌ అయ్యాడు. ఆడిన 12 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టిన దూబె.. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 167/6 పరుగులు చేసింది.


అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్ మధెవెరెను ముకేశ్‌ కుమార్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత మరుమని (27), డియాన్‌ మైర్స్‌ (34) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో జింబాబ్వే ప్లేయర్లు వికెట్లు సమర్పించుకున్నారు. చివరకు 18.3 ఓవర్లలో జింబాబ్వే 125 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్‌ 4, శివబ్‌ దూబె 2 వికెట్లు తీశాడు. తుశార్‌ దేశ్‌పాండే, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మలు ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు. ఈ మ్యాచ్‌ ఫలితంగా భారత్‌ ఐదుమ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com