ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తికరంగా ఛైర్మన్ పోస్టు.. రేసులోకి మరో కొత్త పేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 07:32 PM

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్చటి నుంచి.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ పదవికి ఆయనకు ఇస్తున్నారని.. కాదు, కాదు ఈయనకు ఇస్తున్నారంటూ రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. ఆ పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. అయితే టీటీడీ ఛైర్మన్ పదవిని పలువురు టీడీపీ, జనసేన నాయకులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పదవి కోసం మరో పేరు తెరపైకి వచ్చింది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు కూడా టీటీడీ ఛైర్మన్ రేసులో వినిపిస్తోంది.


టీటీడీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రశాంతి రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని ఆమె మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి విజయం కోసం వేమిరెడ్డి ఫ్యామిలీ చాలా కృషి చేసిందని.. టీటీడీ ఛైర్మన్ పదవిని వేమిరెడ్డి ప్రశాంతికి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో వేమిరెడ్డి ప్రశాంతి గతంలో టీటీడీ సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా, పాలక మండలి సభ్యురాలిగా పనిచేశారని.. ఆ అనుభవంతో టీటీడీ ఛైర్మన్‌గా ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని వారు చెప్తున్నారు.


టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటి వరకూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్లు వినిపించాయి. అందరికంటే ఎక్కువగా అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు కూడా వినిపిస్తుండటంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందనేదీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు జనసేన నేతలు, బీజేపీ లీడర్లు కూడా ఈ పదవిపై నమ్మకం పెట్టుకున్నట్లు టాక్. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు చాలామంది ఆశావహుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. శ్రీవారి ఆశీర్వాదం ఎవరికి దక్కుతుందనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com