ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చంద్రబాబు జోక్యం.. బాధితులకు 24 గంటల్లోగా పరిహారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 07:53 PM

ఎన్టీఆర్ జిల్లా బూదవాడ సిమెంట్ కంపెనీ ప్రమాదంలో బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు బాధితులకు వైద్య సహాయం, పరిహారం విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో బాధితులకు కంపెనీ నుంచి మెరుగైన పరిహారం అందింది. చనిపోయిన వెంకటేష్ కుటుంబానికి రూ.50 లక్షలను సిమెంట్ కంపెనీ పరిహారంగా అందించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించింది. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్కులు అందజేశారు.


జగ్గయ్యపేట మండలంలోని బూదవాడలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం ప్రమాదం జరిగింది. కిలాన్ విభాగంలోని ట్యాంకు పగలడంతో వేడిపొడి కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో బూదవాడకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి చనిపోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిలోనూ కొందరి పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్లు సమాచారం. అయితే 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వేడి పొడి మీద పడటంతో కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సిమెంట్ కంపెనీ నిర్లక్ష్యంపై ఆగ్రహంతో స్థానికులు.. కంపెనీపై దాడికి కూడా యత్నించారు.


మరోవైపు ప్రమాదం సంగతి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా స్పందించారు. ప్రమాదంపై ఆరాతీసిన ముఖ్యమంత్రి.. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ప్రమాదంపై దర్యాప్తు జరిపి కారణాలపై సమగ్ర నివేదిక అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదివారం ఆదేశించారు. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా స్పందించడంతో సిమెంట్ కంపెనీ అధికారులు పరిహారాన్ని వెంటనే అందించారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందించారు. స్వల్ప గాయాలైన వారికి కూడా రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com