కర్నూలు జిల్లాలో ఓ మహిళ చోరీకి వచ్చిన దొంగను పోలీసులకు పట్టించారు. చాకచక్యంగా, సమస్ఫూర్తితో వ్యవహరించి అతడ్ని పట్టుకున్నారు. ఆలూరులోని మర్రిస్వామి మఠం కాలనీలో ఉరుకుందమ్మ నివాసం ఉంటున్నారు. ఆమె తన ఇంటికి తాళం వేసి బయట మంచంపై నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉరుకుందమ్మ ఇంటి తాళం పగులకొట్టి లోపలికి వెళ్లారు. వెంటనే ఈ విషయం గమనించిన ఉరుకుందమ్మ పోలీసులకు మొబైల్ ద్వారా కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ ఇంటి దగ్గరకు వచ్చారు.. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరిని పోలీసులు, స్థానికులు కలిసి పట్టుకున్నారు.. స్థానికులు కోపంలో దొంగపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గాయపడిన దొంగను పోలీసులు ముందుగా స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పారిపోయిన దొంగ.. తన ఇంట్లో బీరువాలోని రూ.2 లక్షల డబ్బులు, 3 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు ఉరుకుందమ్మ చెబుతున్నారు. దొరికిన దొంగను ప్రశ్నించి.. పూర్తి వివరాలు చెబుతామంటున్నారు పోలీసులు.