తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం సంతోషమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి చేపల పులుసు తిన్నారని.. సమస్యల పరిష్కారానికి ఏరోజు చిత్తశుద్ధితో పాటు పడలేదని విమర్శించారు. రాజకీయ పబ్బం కోసం అప్పుడప్పుడు కొన్ని విద్వేషపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. జగన్ ఏపీలో సీఎం కావాలని కేసీఆర్, కేటీఆర్ కోరుకున్నారని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు కృషి చేస్తున్నారన్నారు. జగన్, కేసీఆర్ కాపలా కుక్కల్లాగా సిద్ధంగా ఉన్నారని.. దేనికంటే ఇద్దరు సీఎంలు తీసుకునే నిర్ణయాలను ఏదో ఒక అంశంలో రాజకీయ ప్రయోజనాల కొరకు వ్యతిరేకించాలని అనుకుంటున్నారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అవసరమైతే మరో 10 సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం కావాలని.. రెండు ప్రాంతాల బంధం ఇంకా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు ప్రధానితో సహా కేంద్రంలో అందరు మంత్రులను కలిశారని బీజేపీ నేత వెల్లడించారు.