పరిశ్రమలు స్థాపించి, వలసలు తగ్గిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దత్తిరేజరు మండల కేంద్రంలోని కోమటిపల్లి పెట్రోల్ బంకు పక్కన ఉన్న కేవీఎన్ హనుమత్ గాయత్రీ కల్యాణమండపంలో శుక్రవారం టీడీపీ మండల అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..... యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాగునీటి కోసం ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటా నని భరోసా ఇచ్చారు. కార్యకర్తలందరూ పార్టీని దృష్టిలో పెట్టుకుని కలిసికట్టుగా పని చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మరడాంకు గానీ, మానాపురం వద్దకు గానీ మార్చాలని గ్రామస్థులు కోరారు. దానికి మంత్రి స్పందిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కళాశాలను మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముర్రాపు సురేష్, మాజీ ఎంపీపీ కొండలరావు, బీజేపీ నాయకులు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి మిర్తిరెడ్డి ఈశ్వరరావు, మజ్జి మహేష్, బెజివాడ బంగారు నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.