విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)కు మెట్రోపాలిటన్ కమిషనర్ (ఎంసీ)ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గత రెండేళ్లుగా ఈ సంస్థకు ఎంసీ లేరని, కలెక్టర్కే అదనపు బాధ్యతలు అప్పగించారని, ఆయన బదిలీపై వెళ్లాక కూడా ఎవరినీ నియమించలేదంటూ నాలుగు రోజుల క్రితం ‘పెద్ద దిక్కు లేని వీఎంఆర్డీఏ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే కమిషనర్గా ఐఏఎస్ అధికారిని నియమించడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని, అంతవరకు ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచకుండా ప్రస్తుతం అక్కడే జాయింట్ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వి.రవీంద్రకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇస్తూ నియామకపు ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కొనసాగాలని సూచించింది. పురపాలక శాఖకు చెందిన రవీంద్ర గత మూడేళ్లుగా వీఎంఆర్డీఏలో జాయింట్ కమిషనర్గా కొనసాగుతున్నారు. అవసరమైన సందర్భాల్లో ప్రాజెక్ట్స్, అకౌంట్స్ విభాగాల బాధ్యతలను నిర్వహించారు. కైలాసగిరిపై సర్క్యులర్ ట్రైన్ ప్రాజెక్టు నిర్వహణదారు నుంచి రూ.2 కోట్లకు పైగా బకాయి రావలసి ఉంటే దానిని కోర్టు ద్వారా స్వాధీనం చేసుకొని వీఎంఆర్డీఏ ద్వారానే నిర్వహిస్తున్నారు. దీనివల్ల గత ఆరు నెలల కాలంలోనే రూ.2 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరడం గమనార్హం.