పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జ్యూవెలరీ షాపులోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు తెలివిగా నగలను కొట్టేసి... మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇద్దరు మహిళలు స్థానికంగా ఉన్న శ్రావణి జ్యూవెలరీ షాపుకు నగలు కొనేవారిలా వచ్చారు. దీంతో జ్యువెలరీ షాపులోని వారు.. సదరు మహిళలకు నగలను చూపించారు. అయితే నగలను చూస్తున్నట్టు నటించిన మహిళలు.. ఎవరికీ అనుమానం రాకుండా బంగారు నగల స్థానంలో నకిలీ నగలను పెట్టి చోరీ చేశారు. అనంతరం ఏమీ తీసుకోకుండానే వచ్చిన దారినే వెళ్లిపోయారు. అయితే మహిళలు వెళ్ళిపోయిన తరువాత.. షాపులోని వర్కర్ గఫూర్కు అనుమానం వచ్చి నగలను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వారు నకిలీ నగలు పెట్టి అసలు నగలను దోచుకెళ్లిన విషయాన్ని వర్కర్ గుర్తించాడు. వెంటనే షాపు యాజమనానికి విషయాన్ని తెలియజేశాడు. దాదాపు రెండు లక్షల 40వేల రూపాయలు విలువైన వస్తువులను మహిళలు మాయం చేసి పట్టుకుపోయారు. షాపు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.